గత ప్రభుత్వం రాష్ట్రంలోని నిరుపేదలకు అతి తక్కువ ధరలకే నాణ్యమైన, రుచికరమైన ఆహారాన్ని అందజేసేందుకు నెలకొల్పిన "అన్న క్యాంటీన్లు" అర్ధాంతరంగా మూతబడ్డాయి. గురువారం ఉదయం రోజూ మాదిరిగానే ఈ ఫలహారశాలలకు అల్పాహారం, మధ్యాహ్నం భోజనం కోసం వెళ్లిన వారికీ అవన్నీ తాళాలు వేసి కనిపించాయి. గత కొన్ని నెలలుగా కేవలం రూ.15కి (అల్పాహారం, మధ్యాహ్న, రాత్రి భోజనాలకు రూ.5 చొప్పున) ప్రతి రోజూ కడుపు నింపుకొంటున్న వీరందరికీ తీవ్ర నిరాశ ఎదురైంది. ఇక రాష్ట్రవ్యాప్తంగా 204 క్యాంటీన్లు మూతబడ్డాయి. ఇప్పుడు రోజుకు వాటి కోసం ఎంత లేదన్నా కనీసం రూ.100 నుంచి రూ.120 వరకూ చెల్లించాల్సిన పరిస్థితి ఎర్పడింది. అక్షయపాత్ర ఫౌండేషన్ సంస్థ ఈ అన్న క్యాంటీన్లకు ఆహారం సరఫరా చేస్తున్న విషయం తెలిసిందే.
వైసీపీ ప్రభుత్వం ఈ క్యాంటీన్ల స్థాపన, నిర్వహణలో పలు లొసుగులున్నాయని భావిస్తున్న నేపధ్యం లో గత నెల 31వ తేదీ నుండి ఆహారం సరఫరా చేయనవసరం లేదని అక్షయపాత్ర సంస్థకు కొన్ని రోజుల క్రితం సూచించింది. అయితే నిజానికి గత ప్రభుత్వంతో కుదిరిన ఒప్పందం ప్రకారం ఈ సంస్థ కాంట్రాక్టు ఇంకా 2020 వరకూ ఉందని తెలిసింది. కాంట్రాక్టు కాలపరిమితి ఇంకా ఉండడం, అంతే కాకుండా తమకు ప్రభుత్వం నుంచి కోట్లాది రూపాయల బిల్లులు రావాల్సి ఉండడంతో ఈ సారి కూడా తమనే కొనసాగిస్తారని అక్షయపాత్ర నిర్వాహకులు భావించారు. పురపాలక శాఖాధికారులు కూడా అలాగే భావించి 31వ తేదీ రాత్రి లోగానే కొనసాగింపు ఉత్తర్వులు జారీ అవుతాయని చెబుతూ వచ్చారు. కానీ దీని పై బుధవారం రాత్రి వరకు ఏలాంటి ఆదేశాలు రాలేదు. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో అక్షయపాత్ర ఫౌండేషన్ గురువారం ఉదయం నుంచి అన్న క్యాంటీన్లకు ఆహార సరఫరాను నిలిపివేసింది. అధికారులు పలు చోట్ల ఫలహారశాలలకు తాళాలు వేసి తమ స్వాధీనంలోకి తెచ్చుకున్నారు.
ఇక ఇప్పుడు అర్ధాంతరంగా అన్నక్యాంటీన్లకు సరఫరా నిలిపేయడంతో నిరసనలు మొదలయ్యాయి. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు 20వ వార్డులో ఏర్పాటుచేసిన క్యాంటీన్ కూడా మూతబడడంతో అక్కడకు వచ్చిన అన్నార్తులు ఉసూరుమంటూ వెనుదిరిగారు. అక్కడి టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు వెంటనే స్పందించారు. అప్పటికప్పుడు రోడ్డుపై టెంట్ వేసి సుమారు 300 మందికి భోజనాలు వండించి వడ్డించారు. మంత్రి బొత్స సత్యనారాయణ అసెంబ్లీలో రెండ్రోజుల క్రితం అన్నక్యాంటీన్లను కొనసాగిస్తామని ప్రకటించారని ఆయన గుర్తుచేశారు. అయినా మూసేశారని, వైసీపీ ప్రభుత్వ పాలన ఏ విధంగా అసత్యాలతో సాగుతోందో అని చెప్పుకొచ్చారు.