మొట్టమొదటి వైమానికుడు చరిత్రలో రావణాసురుడేనట. శ్రీలంక ప్రభుత్వమే స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించింది. కాగా దాదాపు 5వేల ఏళ్ల క్రితమే రావణాసురుడు విమానంలో గగనతలంలో విహరించాడని, అయితే రానున్ను ఐదేళ్లలో ఈ విషయాన్ని సాంకేతికంగా నిరూపిస్తామని అంటున్నారు శ్రీలంక వైమానిక అధికారులు. శ్రీలంక సివిల్ ఏవియేషన్ అథారిటీ వైస్ చైర్మన్ శశి దానతుంగే ఈ విషయం గురించి న్యూస్18తో ఫోన్లో మాట్లాడారు. "చరిత్రలో విమానాన్ని ఉపయోగించి గగనతలంలో విహరించిన తొలి వైమానికుడు రావణుడే". పురాణాల ఆధారంగా ఈ విషయం చెప్పడం లేదు, ఈ విషయంలో పూర్తి స్థాయి పరిశోధన జరగాల్సిన అవసరం ఉంది. కనుక వచ్చే ఐదేళ్లలో ఈ విషయాన్ని సాంకేతికంగా నిరూపిస్తాం అన్నారు.
బుధవారం శ్రీలంక కటునాయకేలో ఉన్న బండారునాయకే విమానాశ్రయంలో పౌర విమానయాన నిపుణులు, చరిత్రకారులు, పురావస్తు శాస్త్రవేత్తల సమావేశం జరిగింది. కాగా దాదాపు 5,000 సంవత్సరాల క్రితమే రావణుడు శ్రీలంక నుంచి నేటి భారతదేశానికి వెళ్లి తిరిగి వచ్చాడని ఈ సమావేశం తేల్చింది. అయితే రానున్న ఐదేళ్లలో ఈ విషయాన్ని సాంకేతికంగా నిరూపించాలని నిర్ణయించింది. అంతే కాకుండా శ్రీలంకలో రావణుడిని గొప్ప రాజుగా, దయ గల మనిషిగా చెప్పుకుంటారు. సీతా దేవిని అపహరించాడు, రాక్షసుడు అనే అంశాన్ని అక్కడి ప్రజలు ఒప్పుకోరు. అది కేవలం భారతీయుల వాదనగా కొట్టి పారేస్తారు. శ్రీలంక అంతరిక్షంలోకి కొద్ది రోజుల క్రితం పంపిన ఓ ఉగప్రహానికి రావణ అనే పేరు పెట్టింది.