పుల్వామా దాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని జైషే మహ్మద్ ఉగ్రవాద స్థావరంపై భారత వాయుసేన దళాలు సర్జికల్ స్ట్రైక్స్ చేశాయని భారత విదేశాంగ శాఖ తెలిపింది. ఈ దాడిలో పెద్ద ఎత్తున జైషే మహ్మద్ ఉగ్రవాదులు చనిపోయారని విదేశాంగ శాఖ కార్యదర్శి విజయ్ గోఖలే ప్రకటించారు. ఎంతమంది చనిపోయారనే అంశంపై స్పష్టత రావాల్సి ఉందని అన్నారు. బాలాకోట్లోని జైషే మహ్మద్ టెర్రర్ క్యాంప్ మసూద్ అజహర్ బావమరిది యూసఫ్ అజహర్ ఆధ్వర్యంలో నడుస్తోందని అన్నారు.
దట్టమైన అడవుల్లో ఉన్న ఈ క్యాంప్పై దాడి కారణంగా సామాన్యులకు ఎలాంటి నష్టం కలగలేదని విజయ్ గోఖలే స్పష్టం చేశారు. అయితే భారత్ జరిపిన సర్జికల్ ఎటాక్ పై పాక్ సైన్యాధికారి మేజర్ జనరల్ ఆసిఫ్ గఫూర్ స్పందించారు. దాదాపు 300 మంది మరణించారని భావిస్తుంటే ఒక్కరు కూడా మరణించలేదని ఆయన ట్వీట్ చేయడం సంచలనంగా మారింది.
భారత యుద్ధ విమానాలు పీఓకే ప్రాంతంలో దాడులు జరిపి..భారీ ప్రాణనష్టానికి కారణమైనట్టు వచ్చిన వార్తలను మేజర్ జనరల్ ఆసిఫ్ గఫూర్ తీవ్రంగా ఖండించారు. "ముజఫరాబాద్ సెక్టార్ లో భారత విమానాలు సరిహద్దులను దాటి మూడు నుంచి నాలుగు మైళ్ల దూరం వచ్చాయనీ.. అవి కొన్ని బాంబులను జారవిడిచాయి. అయితే అవి ఖాళీగా ఉన్న ప్రాంతంలో పడ్డాయి తప్ప..మాకు ఎటువంటి నష్టాన్నికలిగించలేదనీ..ఒక్కరు కూడా మరణించలేదు. మరిన్ని వివరాలు కాసేపట్లో వెల్లడిస్తాం" అని ఆయన ట్విట్టర్ లో పేర్కొన్నారు. పాక్ ఆర్మీ చీఫ్ చేసిన ట్వీట్ అవాస్తవమని ఎటాక్ లో 300 మంది ఉగ్రవాదులు మరణించినట్లు తెలుస్తుంది.