ప్రముఖ సాహితీవేత్త ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. నగరంలో తెల్లవారుజామున 4 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఆయన వయస్సు 75 ఏళ్లు. ఇంద్రగంటి భార్య జానకీబాల కూడా రచనారంగంలో స్థిరపడ్డారు. ప్రముఖ సినీ దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ ఆయన తనయుడన్న విషయం తెలిసిందే. జర్నలిస్టుగా జీవితాన్ని ప్రారంభించిన ఆయన రచయితగా స్థిరపడ్డారు. ఆల్ ఇండియా రేడియో విజయవాడ కేంద్రంలో పనిచేశారు.
పలు కథలు, నాటకాలు, గేయాలు, సినీ గీతాలు శ్రీకాంత్ శర్మ రచించారు. కృష్ణావతారం, నెలవంక, రెండు జళ్ల సీత, పుత్తడిబొమ్మ వంటి సినిమాల్లో పాటలు రాశారు. మోహనకృష్ణ దర్శకత్వంలో వచ్చిన ‘సమ్మోహనం’ సినిమాలో ‘మనసైనదేదో’ ఆయన చివరగా రాసిన పాట. ఆయన ఆత్మకథ ‘ఇంటిపేరు ఇంద్రగంటి’ పాఠకాదరణ పొందింది. అల్వాల్ స్వర్గధామ్లో ఈరోజు సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు కుటుంబసభ్యులు తెలిపారు.