టీఆరెస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టును ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది, అంతే కాకుండ దాన్ని తమ ప్రభుత్వం సాధించిన ఘన విజయంగా బాగా మార్కెట్ చేసుకుంటోంది. కాళేశ్వరం ప్రాజెక్టుతో తెలంగాణ లో కరవు తీరుతుందని.. తెలంగాణ అన్నపూర్ణ అవుతుందని చెబుతుంది. ఈ నేపథ్యం లోనే ఆంధ్రాలోని కొత్త ప్రభుత్వాన్నీ తమకు సానుకూలంగా మార్చుకోగలిగింది. కానీ సొంత రాష్ట్రంలో విపక్ష కాంగ్రెస్ లో మాత్రం ఈ ప్రాజెక్టు విషయంలో ఇప్పటికీ సానుకూలత తేలేకపోతోంది.
అయితే ఇప్పుడు తాజాగా ఈ విషయం పై మాజీ మంత్రి - కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టు వలన తెలంగాణ ప్రభుత్వంపై అదనంగా రూ.40 వేల కోట్ల భారం పడిందని లెక్కలు చెప్పుకొస్తున్నారు. తమ్మిడిహట్టి వద్ద ఆనకట్ట నిర్మించకపోవడం వల్ల రాష్ట్రంపై రూ. 40 వేల కోట్ల అదనవు భారం పడటమే కాదు, నీటి ఎత్తిపోతల విషయం లో విలువైన 15 రోజుల సమయం కూడా కోల్పోయామని జీవన్ రెడ్డి పేరుకొన్నారు.
ఒకవేళ తమ్మిడిహట్టి వద్ద ఆనకట్ట నిర్మించి ఉంటే ఇప్పుడు సుందిళ్లకు నీటిని తరలించే అవకాశం ఉండేదని ఆయన అన్నారు. ఇప్పుడు ఇక మేడిగడ్డ - అన్నారం ఎత్తిపోతలతో అదనపు భారంతో పాటు విలువైన సమయం కూడా వృథా అయిందని, సీఎం కేసీఆర్ వలన రాష్ట్రంపై రూ.40 వేల కోట్లకు పైగా ఆర్థిక భారం పడిందని అన్నారు. సీఎం తన ఆలోచన ఇప్పటికైనా మార్చుకొని తమ్మిడిహట్టి వద్ద ఆనకట్ట నిర్మించాలని జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు.
తమ్మిడిహట్టి వద్ద ఆనకట్ట కడితే ప్రభుత్వ డొల్లతనం బయటపడుతుందన్న ఆయన.. కేసీఆర్ అనవసరపు ఆలోచనలతో రాష్ట్ర ప్రభుత్వంపై అదనపు భారం పడుతోందని పేరుకొన్నారు. అంతే కాకుండా కాళేశ్వరం ప్రాజెక్టుకు మీడియా ప్రతినిధులను తీసుకెళ్తోన్న కేసీఆర్, వారిని తమ్మిడిహట్టి వద్దకు కూడా తీసుకెళ్ళాలని జీవన్ రెడ్డి కోరారు. లేదంటే కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో వారిని తమ్మిడిహట్టికి తీసుకెళ్తామని చెప్పుకొచ్చారు. జీవన్ రెడ్డి ఇప్పుడు చేసిన రూ.40 వేల కోట్ల అదనపు భారం ఆరోపణలు సంచలనంగా మారాయి.