పొట్టకూటి కోసం సౌదీ వెళ్లిన తెలంగాణకు చెందిన ఓ యువకుడు అక్కడ నరకయాతన అనుభవిస్తున్నాడు. సిటీలోని ఫాం హౌస్లో పని అని చెప్పి ఆ యువకుడిని పంపిన ఏజెంట్ అతన్ని దారుణంగా మోసం చేశాడు. సిటీలో పని అని వెళ్ళిన ఆ యువకుడిని అక్కడ గొర్రెల కాపరిగా బ్రతకడమే నరకం అయ్యింది . రోజూ సుమారు మూడొందల గొర్రెలను షెడ్డు నుంచి తోలుకెళ్లడం.. సాయంత్రానికి మళ్లీ షెడ్డుకు తోలుకురావడం ఇదే అతని పని. వాటిని అక్కడ మేపలేక స్వదేశానికి వెళ్లిపోతానంటే గొడ్డును బాదినట్లు బాదుతున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల కేంద్రానికి చెందిన మహమ్మద్ సమీర్(22) నెలరోజులుగా అనుభవిస్తున్న నిత్యనరకమిది.తన బాధను ఎవరితో చెప్పుకోవాలో అర్థం కాక తీవ్ర వేదనకు గురైన ఆ యువకుడు తన సెల్ఫోన్లో ఒక వీడియో మెసేజ్ను రికార్డు చేశాడు. ఈ వీడియోను మరో యువకుడి ద్వారా కేటీఆర్కు ట్వీట్ చేశాడు. తండ్రి చనిపోవడంతో కుటుంబానికి అండగా ఉండేందుకు గతనెల 15న సమీర్ గల్ఫ్ వెళ్లాడు. నిజమాబాద్కు చెందిన వాహిద్ అనే ఏజెంట్ సమీర్ నుంచి 83 వేల రూపాయలు తీసుకుని అతన్ని మోసం చేశాడు.
సిటీలోని ఫాం హౌస్లో పని అని చెప్పి తీరా అక్కడికి వెళ్లాక సిటీ నుంచి 1200 కిలోమీటర్ల దూరం తీసుకువెళ్లి గొర్రెల కాపరిని చేశాడు. ఆ పని చేయలేక తాను స్వదేశానికి వెళ్లిపోతానంటే యజమాని ఇష్టమొచ్చినట్లు కొడుతున్నాడు.సమీర్ వీడియోను ట్విట్టర్లో చూసిన కేటీఆర్ స్పందించారు. సమీర్ను సురక్షితంగా స్వదేశానికి రావడానికి సహకరించాలని భారత్లోని సౌదీ అరేబియా అంబాసిడర్ ఆసఫ్ సయీద్కు, రియాద్లోని ఇండియన్ ఎంబసీకి ట్వీట్ చేశారు. మరోవైపు, సమీర్ అనుభవిస్తున్న నరకం గురించి స్వగ్రామంలోని తన మిత్రుడు ద్వారా తెలుసుకున్న కుటుంబీకులు ఏజెంట్ వాహిద్ను ఫోన్లో సంప్రదించారు. తాను సౌదీ అరేబియాలో ఉన్నానని రూ.లక్ష చెల్లిస్తే సమీర్ను ఇంటికి పంపించే ఏర్పాట్లు చేస్తానని నిర్లక్ష్యంగా చెప్పాడు. పేదవారమని అంత ఇచ్చుకోలేమనడంతో 50 వేలకు ఒప్పందం కుదిరింది. 10 రోజుల క్రితం సౌదీలోని ఏజెంట్కు సమీర్ కుటుంబీకులు డబ్బులు పంపారు. అయినా ఏజెంట్ స్పందించలేదు.