అక్షయ తృతీయ సమీపిస్తోంది. ఈ రోజున బంగారం కొనుగోలు చేస్తే సంపద కలిసి వస్తుందన్నది చాలా మంది విశ్వాసం. అయితే గత కొంత కాలంలో పసిడి ధరల్లో హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటున్నాయి. అయినా ధర మాత్రం ముందుకే సాగుతోంది. పెట్టుబడి దృక్పథంతో ఈ అక్షయ తృతీయ రోజు బంగారం కొనాలా? వద్దా? ఒకవేళ పసిడిని కొనుగోలు చేస్తే ఎంత ధరలో కొనాలి? సంవత్సరం చివరినాటికి ధర ఏ స్థాయికి చేరుకునే అవకాశం ఉందనే విషయాన్ని రిలయన్స్ కమోడిటీస్ హెడ్ ప్రీతమ్ కుమార్ పట్నాయక్..
భారతీయ సంస్కృతిలో బంగారానికి అత్యధిక ప్రాధాన్యత ఉంది. అక్షయ తృతీయ, ధన త్రయోదశి వంటి పర్వదినాల్లో బంగారానికి ఇచ్చే ప్రాధాన్యత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ రోజుల్లో ఆభరణాల దుకాణాలు కొనుగోలుదారులతో కిక్కిరిసి పోతుంటాయి. ఈ రోజుల్లో ఎంతో కొంత బంగారం కొనుగోలు చేసినా ఆ సంవత్సరమంతా లక్ష్మీ దేవి ఇంట్లోనే కొలువుదీరుతుందన్నది చాలా మంది నమ్మకం. ఈ నమ్మకాన్ని సొమ్ము చేసుకునేందుకు నగల వ్యాపారులు ఆకర్షణీయమైన స్కీములు, డిస్కౌంట్లు ఆఫర్ చేస్తుంటారు.అక్షయ తృతీయ ఈసారి మే 7న వచ్చింది. గత ఏడాది అక్షయ తృతీయ రోజు బంగారం కొనుగోలు చేసిన వారు ప్రస్తుతం మంచి లాభాల్లోనే ఉన్నారు. గత ఏడాది కాలంలో పసిడి ధర 14 శాతం వరకు పెరిగింది. ఈ 12 నెలల కాలంలో ఒక దశలో 10 గ్రాముల పసిడి ధర రూ.34,031 స్థాయికి కూడా పోయింది. కొన్ని అడ్డంకులు ఉన్నా, ఈ సంవత్సరం కూడా బులియన్ మార్కెట్ మదుపరులకు మంచి లాభాలే ఇస్తుందని భావిస్తున్నాం.
ధరల శ్రేణి
వచ్చే ఆరు నెలల్లో ఔన్స్ (31.10 గ్రాములు) బంగారం 1,250 నుంచి 1,365 డాలర్ల మధ్య ట్రేడయ్యే అవకాశం ఉంది. ప్రస్తుత మారకం రేటు ప్రకారం ఇది సుమారు రూ.87,500 నుంచి రూ.95,550కు సమానం. పరిస్థితులు అనుకూలిస్తే సంవత్సరాంతానికి ఔన్స్ పసిడి ధర 1,400 డాలర్లకు చేరే అవకాశం కనిపిస్తోంది. అయితే స్వల్ప, మధ్య కాలానికి మాత్రం మదుపరులు అప్రమత్తతతో ఉండాలి.
ఇవి సానుకూల అంశాలు.. అమెరికా వడ్డీ రేట్లు
అమెరికాలోనూ జీడీపీ వృద్ధి రేటు నీరసిస్తోంది. దీంతో ఆ దేశ కేంద్ర బ్యాంక్ ‘ఫెడరల్ రిజర్వ్’ ఇంతకు ముం దు ప్రకటించిన విధంగా, సమీప భవిష్యత్లో వడ్డీ రేట్లు పెంచే అవకాశం కనిపించడం లేదు. అమెరికాలో వడ్డీ రేట్లు ఎంత తక్కువగా ఉంటే బులియన్ మార్కెట్ అంత బాగుంటుంది. వడ్డీ రేట్లు పెరిగితే మాత్రం పసిడి ధర అందుకు వ్యతిరేక దిశలో పయనిస్తుంది.
వృద్ధి రేటు
అమెరికా-చైనా మధ్య చెలరేగిన వాణిజ్య యుద్ధం ఇప్పట్లో చల్లబడే సూచనలు కనిపించడం లేదు. దీనికి తోడు ఈయూ, చైనా, జపాన్లలోనూ వృద్ధి రేటు అంతంత మాత్రంగానే ఉంది. ఇరాన్పై ఆర్థిక ఆంక్షలు తాజాగా ఇందుకు తోడయ్యాయి. ఇవన్నీ పసిడి మార్కెట్ను మరింత ముందుకు నడిపించ నున్నాయి.
సరఫరాకు మించి డిమాండ్
బంగారానికి డిమాండ్ ఉన్న స్థాయిలో సరఫరా లేదు. గత ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరం పసిడి సరఫరా ఒక శాతం మాత్రమే పెరిగి 4,707 టన్నులకు చేరుతుందన్నది మార్కెట్ వర్గాల అంచనా. ఇదే సమయంలో భారత్, చైనాల్లో నగల తయారీతోపాటు పెట్టుబడి లాభాల కోసం బంగారానికి డిమాండ్ పెరుగుతోంది.
కేంద్ర బ్యాంకుల కొనుగోళ్లు
ఇటీవల చైనా, రష్యా, భారత్ వంటి దేశాల కేంద్ర బ్యాంకులు పెద్ద ఎత్తున పసిడి నిల్వలు పెంచుకుంటున్నాయి. గత ఏడాది ప్రపంచంలోని వివిధ కేంద్ర బ్యాంకులు 657 టన్నుల పసిడిని కొనుగోలు చేశాయి. 2017తో పోలిస్తే ఇది 74 శాతం ఎక్కువ. గత మూడు నాలుగు నెలల్లోనే చైనా కేంద్ర బ్యాంక్ 45 టన్నుల పసిడి కొనుగోలు చేసింది. మున్ముందు ఈ ధోరణి కొనసాగే అవకాశం ఉంది.
మద్దతు ధర
దీర్ఘకాలిక పెట్టుబడి వ్యూహంతో ఆలోచిస్తే బంగారం ప్రస్తుత ధర ఆకర్షణీయంగానే కనిపిస్తోంది. ఫండమెంటల్స్ పరంగా స్వల్పకాలానికి చూస్తే మాత్రం, అంత ఆకర్షణీయంగా లేదు. 21 రోజులు, 50 రోజుల సగటు కదలిక పరంగా చూస్తే భారత మార్కెట్లో ప్రస్తుతం 10 గ్రాముల పసిడి ధర రూ.30,600 నుంచి రూ31,130 మధ్య ట్రేడవుతోంది. ధర మరింత తగ్గి రూ.30,000 నుంచి రూ.30,500 స్థాయికి వస్తే మదుపరులు దాన్ని మద్దతు ధరగా పరిగణించి కొనుగోళ్లపై నిర్ణయం తీసుకోవచ్చు. సంవత్సరాంతానికి దేశీయ మార్కెట్లో 10 గ్రాముల పుత్తడి ధర 33,500 నుంచి రూ.34,000 వరకు పెరిగే అవకాశం ఉంది.